ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
19-09-2021
కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన రైతు వ్యతిరేక, కార్పోరేట్ అనుకూల మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 10 నెలలుకు పైగా దేశ రైతాంగం పోరాడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పది నెలలుగా ఎండలో, వానలో, చలిలో వేలాది మంది రైతులు రోడ్ల మీదే ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక రకాల పోరాట రూపాలను అనుసరిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ఈ నెల 27న భారత బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది సీపీఐ (మావోయిస్టు). బంద్ విజయవంతం చేయవలసిందిగా భారత ప్రజలకు పిలుపునిస్తూ ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేశారు.
ప్రకటన పూర్తి పాఠం....
నవంబర్ 17, 2020
హిందుత్వ మెడలు వంచుతూ 10 మాసాలుగా విజయపథంలో పురోగమిస్తున్న భారత రైతు పోరాటానికి విప్లవ జేజేలు 27
సెప్టెంబర్ 2021 భారత్ బంద్ సంపూర్ణంగా సఫలం చేయండి
గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని భగ్నం చేయడానికి అనేక కుట్రలు పన్నింది. పెద్ద సంఖ్యలో ఆ సభకు రైతులు హాజర్ కాకూడదని జాతీయ రహదారులన్నీ ముఖ్యంగా హర్యానా, పంజాబ్ లతో పాటు యూపీలోని మిగితా జిల్లాల రహదారులను మీరట్ జోన్ (మీరట్, ఘజియాబాద్, శామ్స్, భాగ్) నుండి సమీకరించిన పీఏసీ (రాష్ట్ర సాయుధ పోలీసులు)లతో దిగ్బంధించింది. భయోత్పాతాన్ని సృష్టించే రీతిలో సభాస్థలిపై డిజిటల్ కెమరాలు అమర్చిన ప్రత్యేక డ్రోన్లతో పహరా కాయించింది. నగరమంతా సీసీటీవీలతో నింపేసింది.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేపట్టడంలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మత ఘర్షనలను రెచ్చగొట్టడంలో హిందుత్వ శక్తులకు ఒక ముఖ్య కేంద్రంగా నిలిచిన ముజఫర్నగర్ లో అపూర్వ స్థాయిలో రైతుల సభను జరుపడం అక్కడ తమ అధికారం కోసం హిందుత్వ శక్తులు 2013లో బలిగొన్న 62 మంది మృతజీవులను గుర్తు చేయడమే కాకుండా నిరాశ్రయులైన 50 వేల మందికి ఊరటను కలిగిస్తుంది.
పశ్చిమ బంగ్ విధానసభ ఎన్నికలలో తాము ఎదుర్కొన్న ఓటమి తీరులో రానున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ విధానసభ ఎన్నికలలో ఎదుర్కోవలసి రావచ్చుననే దిగులుతో పాటు తన ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన అమలు కాని హామీలన్నీ ఏకరువు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతారనే చాణక్య తెలివితోనే యోగీ దానిని నడువనీయకూడదని ఖాకీలతో ముజఫర్ నగర్ను నింపేశాడు. కానీ, వ్యవసాయ దేశమైన భారతదేశంలో పోరాడే రైతాంగాన్ని ఏ శక్తి అడ్డుకోలేదనీ దేశంలోని 22 రాష్ట్రాల నుండి పెద్దెత్తున హజరైన యువతతో పాటు రైతు మహిళలతో విజయవంతమైన ఆ మహాపంచాయత్ నిరూపించింది. ఆ సభకు హాజరైన రైతాంగానికి విప్లవ జేజేలు.
గత పది మాసాలుగా దేశంలో కొనసాగుతున్న సమరశీల రైతు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలనీ అందులో భాగంగా 27 సెప్టెంబర్ భారత్ బంద్ పాటించాలనీ ఆ సభా ముఖంగా ఇచ్చిన పిలుపును మా పార్టీ పూర్తిగా బలపరుస్తున్నది. మా పార్టీ గతంలోనే ఉత్తరప్రదేశ్ విధానసభ ఎన్నికలలో హిందుత్వ శక్తుల ఓటమికి రైతు ఉద్యమం నుండి పిలుపునివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసి ఉన్నందునా ʹభాజపా ఓటమికి నడుం బిగించండిʹ అనే పిలుపును కూడ నిర్ద్వందంగా సమర్థిస్తున్నది. దాదాపు 300ల రైతు సంఘాలను సమన్వయిస్తూ నిరంకుశ సాగు చట్టాల రద్దుకై హిందూ ముస్లిం రైతాంగంతో మమేకమై పోరాడుతున్న సంఘాలతో మా పార్టీ నాయకత్వంలో గల అన్ని రాష్ట్రాలలోని విప్లవ రైతు సంఘాలన్నీ మరింత సమైక్యమవుతూ భుజం భుజం కలిపి పోరాడుతాయనీ ఈ సందర్భంగా మరోసారి మా కేంద్రకమిటీ స్పష్టం చేస్తోంది.
దేశాన్ని అమ్మకానికి పెట్టిన దుష్ట శక్తుల నుండి దేశాన్ని, దేశ రైతాంగాన్ని, వ్యాపారులను, ఉద్యోగులను,యువతను కాపాడుకునే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ముజఫర్ నగర్ మహాపంచాయత్ ను జయప్రదం చేసిన తీరులోనే దేశ వ్యాపితంగా జరుప తలపెట్టిన 25 మహా పంచాయతీలను అపూర్వ స్థాయిలో జయప్రదం చేయాలనీ మా పార్టీ కేంద్ర కమిటీ సంయుక్త కిసాన్ మోర్చాకు విజ్ఞప్తిచేస్తోంది. ముజఫర్ నగర్ తో పాటు దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దాదాపు 5,000 స్టాల్స్ ఏర్పర్చి మహాపంచాయత్ కు హాజరైన 22 రాష్ట్రాల రైతులకు ఉచిత సౌకర్యాలు కల్పించడం అభినందనీయం. ఈ సహకార సత్సాంప్రదాయాన్ని భవిష్యత్ లో జరిగే అన్ని సభల వేళ ఎక్కడికక్కడి ప్రజలు కొనసాగిస్తారనీ అశిస్తున్నాం.
రైతులను ఉగ్రవాదులన్నా, టర్బన్ నక్సలైట్లన్నా ఇంకే పేరుతో దుష్ట హిందుత్వ శక్తులు పిలిచినా రేపు వారిని తమకు మరింత ప్రమాదకరంగా భావించినపుడు నిరంకుశ నిర్బంధ చట్టాల కింద నిర్బంధించి కటకటాల పాలు చేయడానికేనన్నది మరిచిపోకూడదు. భారత రైతుల పాలిట మృత్యు గంటలు వినిపిస్తూ కార్పొరేటు వర్గాల ప్రయోజనాలను ఈడేర్చ తలపెట్టిన సాగు చట్టాల రద్దుకై సాగుతున్న ఉద్యమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా పూర్తి అంకితభావంతో పోరాడాలనీ మా పార్టీ యావత్ రైతాంగాన్ని కోరుతోంది.
ఇప్పటికే ఈ ఉద్యమంలో పోలీసు నిర్బంధం సహ ఇతర అనేక కారణాలతో దాదాపు 500 మందికి పైగా రైతాంగం అసువులు బాసారు. రైతాంగ ఉద్యమాన్ని అప్రతిష్ట పాల్జేసి దెబ్బ తీయడానికి 26 జనవరి నాడు ఎర్రకోటపై ఆ ఉద్యమంతో సంబంధంలేని జెండాలు ఎగురవేయడం నుండి ఆ రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి హిందుత్వ శక్తులు పన్నని కుట్ర లేదు. రైతుల సంఘటిత శక్తిని దెబ్బతీయడానికి కొరోనా మహమ్మారీ సోకే ప్రమాద అస్త్రాన్ని కేంద్ర నాయకులు వినియోగించే విఫల ప్రయత్నం చేశారు. రైతాంగ ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయత్ కాన్వాయిపై దాడులకు పాల్పడ్డారు. రాజీ లేని పట్టుదలతో ఉద్యమిస్తున్న రైతు సంఘాల మధ్య చిచ్చు రేపి వాటి ఐక్యతను దెబ్బ తీయడానికి అనేక కుట్రలకు పూనుకున్నారు. అయినప్పటికీ రైతుల సంకల్పం చెక్కు చెదరలేదు. దానితో కేంద్రం యేజ్లర్థకాలం సాగు చట్టాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఆ ఉద్యమం సాధించిన అనేక విషయాలలో అతి ముఖ్యమైనది.
పశ్చిమ బంగా ఎన్నికలలో ఓడిన హిందుత్వ శక్తులు దేశంలో రానున్న సంవత్సరాలలో జరుగనున్న ఎన్నికలలో ఓటమి భయం లేకుండా పోటీ చేయడానికి నిరంకుశ చట్టాలను రద్దు చేస్తామనే హామీలను గుప్పించినా ఆశ్యర్యపోకూడదు. పరమ మోసకారి తనంతో బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు ఇచ్చే హామీలను నమ్మకుండా లోకసభలో తిరిగి వాటిని ఉపసంహరించుకునే వరకు రైతు ఉద్యమాన్ని అత్యంత జాగరూకతతో కొనసాగించి తీరాలనీ మా పార్టీ కోరుతోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా గొప్పలు పోయే మన దేశంలో ఇలాంటి విద్రోహకర అనుభవాలు కోకొల్లలు. సాగు చట్టాల రద్దుకు సిద్ధం కాని ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయకూడదనీ ప్రజలకు పిలుపు నివ్వాలి.
దేశంలో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా నిలిచిపోలేదు. ఈయేడు వర్షాభావంతో ఖరీఫ్, రబీ పంటలు దెబ్బతినే పరిస్థితులే నెలకొన్నాయి. ఒడిశాలో ఈయేడు గత 23 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదవుతోంది. కేంద్ర,
రాష్ట్రాల ప్రభుత్వాలు రైతుల భూములకు ఎసరు పెడుతూ సక్రమంగా అమలు కాని కంటి తుడుపు సంస్కరణలు ప్రకటిస్తున్నారు. పంజాబ్ లో అదనపు విద్యుత్ చార్జీలు వసూలు చేస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు.
తెలంగాణలో కానీ పంజాబ్ లో కానీ దళితులకు, పేదలకు ఇవ్వాల్సిన వ్యవసాయ భూముల జాడే లేదు. మరోవైపు రైతుల భూములు కార్పొరేటు వర్గాలకు కారుచౌకగా అప్పనంలా అప్పగిస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఈ దేశ వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడానికి నడుం బిగిద్దాం. దేశ వనరులను కాపాడుకోవడానికి దేశ మూలవాసులు మునుపెన్నటికన్నా సమరశీలంగా పోరాడుతున్నారు.
అడవులలో లక్షల సంఖ్యలో పోలీసు బలగాలు అవసరం లేదనీ, గ్రామసభల అనుమతి లేకుండా ఎక్కడా పోలీసు స్టేషన్/ క్యాంపు పెట్టకూడదనీ పాలకవర్గాల భద్రతా బలగాలు కొనసాగిస్తున్న హత్యలను, అత్యాచారాలను ఖండిస్తూ బలగాలను వెనక్కి తీసుకోవాలనీ ఉద్యమిస్తున్నారు. బీజాపుర్ జిల్లాలోని సిలింగేర్ ప్రజా ధర్నా ఒక నమూనాగా నాలుగు మాసాలకు పైగా కొనసాగుతోంది. వాటితో రైతాంగ ఉద్యమం మమేకం కావల్సిన అవసరం ఉందనీ మా పార్టీ కోరుతూ కార్మిక, కర్షక, ఉద్యోగ, విద్యార్థి, దళిత, అదివాసీ, ముస్లిం, మహిళా ఉద్యమాలన్నీ సమన్వయంతో సాగకుండా దేశాన్ని కాపాడుకోలేం అని స్పష్టం చేస్తోంది.
దేశంలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగం పెరిగి కార్మికుల జీవితాలు ఉద్యోగ హామీ లేకుండాపోయి పెరిగిన పని గంటల భారంతో సతమతమవుతున్నాయి. చమురు ధరలు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు తారస్థాయికి చేరి సామాన్యుల కొనుగోలు శక్తిని పరీక్షిస్తున్నాయి. కొరోనా మహమ్మారీతో పాలకులు విచక్షణా రహితంగా లాక్ డౌనులు ప్రకటిస్తూ వలస కూలీల ఉసురు తింటున్నారు. అడ్డమైన నిర్ణయాలతో కొరోనా వ్యాప్తికి పూనుకుంటున్నారు. ప్రజలకు కనీస వైద్యం అందించకుండా లక్షల సంఖ్యలో వారి మరణాలకు కారకులవుతున్నారు. దేశం అన్ని రంగాలలో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నది. మరోవైపు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పేర్కొన్నట్టు పాలకులు దేశాన్ని విశ్వవిపణిలో అమ్మకానికి పెడుతున్నారు. ఈ దేశాన్ని మనమే కాపాడుకోవాలి. నిన్నటి వరకు సాంస్కృతిక జాతీయవాదం పాట పాడిన సంఘ్ ముఠా గత పదేళ్లకు పైగా అన్ని రంగాలలో సామ్రాజ్యవాద ఆర్థిక విధానాలను దూకుడుగా అమలు చేస్తూ ఆత్మనిర్బర్ అంటూనే దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నది.
ఈ దేశానికి నామమాత్ర స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తి కానున్న వేళ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అంటూ పాలకులు వేడుకలకు పిలుపు ఇస్తున్నారు. కానీ ఉద్యమ రైతులు నినదిస్తున్నట్టు విశ్వవిపణిలో దేశాన్ని అమ్మకానికి పెట్టిన పరాధీన భారతాన్ని లౌకిక, ప్రజాస్వామిక, స్వావలయిన భారత్ గా మార్చుకుంటూ కాపాడుకుందాం. మన ప్రియమైన భారత దేశాన్ని సామ్రాజ్యవాదుల సంకెళ్ల నుండి బడా భూస్వామ్య బడా బూర్జువా శక్తుల అధికారం నుండి పోరాడి గెలుచుకుందాం.
అభయ్,
అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
Keywords : farmers protest, bharat bandh, CPI Maoist, BKU, Bharat Kisan Union
(2024-05-17 02:28:32)
No. of visitors : 1848
Suggested Posts
| అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు
- అడ్డుకున్న పోలీసులురైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ నిర్వహించారు. |
| తీవ్రమైన రైతుల ఉద్యమం - రాజకీయ ఖైదీలను రిలీజ్ చేయాలని డిమాండ్ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రంలో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుకు గురై జైళ్ళలో ఉన్న వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తేల్తుంబ్డే, గౌతమ్ నవాలఖా తో సహా ఎల్గర్ పరిషథ్ కేసులో ఉన్న వారందరినీ విడుదల చేయాలని అదే విధంగా ఢిల్లీలో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చే |
| రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళపై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. |
| ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు
ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు. |
| దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన
ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ |
| ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది. |
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. |
| ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపువాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు..... |
| కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖభారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్లోని |
| రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్రభుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డకు మాసిక వేయడమే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. |